Saturday 5 December 2015

ఖలేజా సినిమాలో బ్లండర్.




ఈ వీడియో చూడండి. ఖలేజా సినిమా మొదట్లో సునీల్ ఒక టివి చానల్ తరపున డాక్యుమెంటరీ షూటింగ్ కోసం వేన్ మీద రాజస్థాన్‌లోని ఎడారికి వస్తాడు. అక్కడ తన అసిస్టెంట్స్‌తో మాట్లాడుతుండగా నేలలో ఇసుకలోంచి మహేష్ బాబు లేచి వస్తాడు. అది చూసి భయపడిన సునీల్ అసిస్టెంట్స్, వాళ్ళు వచ్చిన వేన్‌లో పారిపోతారు. అప్పుడు అందరూ రోడ్డు పక్కనే ఉంటారు. కాని వేన్ వెళ్ళిపోగానే సునీల్, మహేష్ బాబు పక్కనున్న రోడ్డువైపుకి వెళ్ళకుండా, కావాలని దారి తప్పినట్టు ఎడారిలోకి వెళతారు. పైగా అరిస్తే పారిపోయేవాళ్ళు అసిస్టెంట్లు కాదంటూ సగం పంచ్ డైలాగు ఒకటి వేస్తాడు మహేష్ బాబు. ఆ తరువాత ఇద్దరూ ఎడారి నుండి బయట పడడానికి దారి కోసం తిరుగుతూ, తిరుగుతూ అనుష్కని, అలీని కలిసి ఎప్పటికో మహేష్ కలవాల్సిన దిలావర్ సింగ్ కుటుంబాన్ని కలుస్తారు. పోనీ మహేష్‌బాబుకి ఎడారిలో దిలావర్ సింగ్ కుటుంబాన్ని వెదకాల్సిన పని ఉందనుకున్నా, సునీల్‌కి ఎడారితో పనేమిటి? తన అసిస్టెంట్స్‌ని వెతుకుతూ రోడ్డువైపే వెళ్ళాలి కదా!
మహేష్‌బాబు కూడ దిలావర్ సింగ్ కుటుంబాన్ని వెతకాలంటే ఎడారిలోనే దారి తప్పి వెతకాలా? లేక రోడ్డు మీద ప్రయాణిస్తూ ఆ ఊరిని వెతకాలా? ఆ రోడ్డు మీద, పక్కన ఒంటెలు కూడ తిరుగుతూ ఉంటాయి. కనీసం వాటి మీద ప్రయాణించి అయినా వెతక వచ్చు, కాని వీళ్ళు ఎడారికి అడ్డంపడి వెతుకుతూ ఉంటారు. 
      

Friday 20 November 2015

సాగర సంగమం - సరికొత్తగా...


సాగర సంగమం సినిమా విడుదలై ఇప్పటికి ముప్పయ్యేళ్ళు దాటింది. కళాతపస్వి విశ్వనాథ్ దర్శకత్వం, కమల్ హాసన్, జయప్రదల అద్భుత నటన, ఇళయరాజా - వేటూరిల మధురమైన పాటలు, జంధ్యాల మాటలు, ఈ చిత్రాన్ని భారతీయ చిత్రాల్లోనే గొప్పవైన 100 చిత్రాల్లో ఒకటిగా నిలబెట్టాయి.

సాగర సంగమం సినిమా చేసేటప్పటికి కమల్ వయసు ముప్పయ్యేళ్ళ లోపే. ఇప్పుడు కమల్ వయసు అరవయ్యేళ్ళ పైనే. అయినా కమల్ హాసన్ ఇంకా హీరోగా నటిస్తూ ప్రేక్షకులని మెప్పిస్తున్నాడు. ఇన్నాళ్ళ తన నటప్రస్థానంలో కమల్ అందుకోని అవార్డు, రివార్డు ఏమీ లేదనే చెప్పాలి. సాగర సంగమం సినిమాలో కమల్ పాతికేళ్ళ యువకుడిగా కొంతసేపూ, సుమారు అరవయ్యేళ్ళ పెద్దవాడిగా కొంతసేపూ కనిపిస్తాడు. సినిమా నిడివి పరంగా చూస్తే రెండు పాత్రలకి ఇంచుమించు సమానమయిన వ్యవధి ఉంటుంది. రెండు వయసుల పాత్రల్లోనూ కమల్ చక్కగా ఒదిగిపోయి అద్భుతంగా నటించాడు.

తెలుగువాళ్ళందరూ ఈ సినిమాని కొన్ని డజన్ల సార్లు చూసి ఉంటారు. అలాగే నేను కూడ ఎన్నో సార్లు చూసాను. అలా ఈ మధ్య మరోసారి టివిలో ఈ సినిమా చూస్తున్నపుడు నాకో సరదా ఆలోచన వచ్చింది. ఎందువల్లనంటే ఈ మధ్య ఏదో సినిమాకి వెళ్ళినప్పుడు కమల్ కొత్త సినిమా "చీకటి రాజ్యం" ట్రైలర్ చూపించాడు. అది చూసినపుడు అయ్యో కమల్ ముసలివాడయిపోతున్నాడే అని అనిపించింది.
సాగర సంగమం సినిమాలో కమల్ సగం సేపు యువకుడుగా, మిగతా సగం వయసు మళ్ళినవాడుగా కనిపిస్తాడు కదా. అలాంటప్పుడు కమల్ యువకుడిగా ఉన్న భాగాన్ని అలాగే ఉంచేసి, కమల్ వయసుమళ్ళినవాడిగా ఉన్న భాగాన్ని ఇప్పటి కమల్‌తో పునర్నిర్మించి కలిపితే ఎలా ఉంటుంది? నాకయితే చాలా బాగుంటుందనిపించింది.
కమల్‌తో పాటు జయప్రద కూడ ఇప్పుడు వయసులో పెద్దదయిపోయింది. ఇప్పుడు ఆ తల్లి వయసు పాత్రకి జయప్రద సరిగ్గా సరిపోతుంది. అలాగే శరత్ బాబు కూడ తన పాత్ర తానే చెయ్యవచ్చు. శరత్ బాబు ఈ మధ్య ఎక్కువగా నటించడం లేదు. ఆయన ఆరోగ్యంగానే ఉన్నారనుకుంటున్నాను. ఇక మిగిలిన ముఖ్యమైన పాత్ర, శైలజ పోషించిన జయప్రద కూతురు పాత్ర. ఇప్పుడు శైలజ ఆ పాత్రకి సరిపోదు కాబట్టి, కమల్ కూతురు శృతి హాసన్ అయితే బాగుంటుంది. నిజ జీవితంలో కమల్ కూతురు అయిన శృతి, సినిమాలో జయప్రద కూతురుగా నటిస్తే కమల్‌తో అనుబంధం బాగా వర్కవుటవుతుంది.
ఈ ఆలోచనని నా దగ్గరి స్నేహితులతో చర్చిస్తే, వాళ్ళకి అంతగా నచ్చలేదు. అప్పట్లోనే కమల్, జయప్రద ముసలివాళ్ళుగా బాగా చేసారు కదా, మళ్ళీ ఇప్పుడు రీషూట్ చెయ్యడం ఎందుకు? అన్నారు. నిజమే, అప్పుడే కమల్, జయప్రద చాలా బాగా చేసారు. కాని ఇప్పుడైతే వాళ్ళ శరీరం కూడ వయసుకు తగ్గట్టుగా కనపడుతుంది. మేకప్ పెద్దగా అవసరముండదు. జీవితానుభవం కూడ వాళ్ళ నటనలో మరింత సహజత్వాన్ని తెస్తుంది. అన్నింటిని మించి ఇది ఒక కొత్త ప్రయోగంలా ఉంటుందని నా అభిప్రాయం. కమల్ కూడ తన సినిమాలతో ఇలా ఎన్నో ప్రయోగాలు చేసాడు. ఇది మరో ప్రయోగం అవుతుంది. ఇలాంటి ప్రక్రియ మన దేశంలో కాని, విదేశాల్లో కాని ఎవరైనా చేసారో లేదో తెలియదు. సాగర సంగమం సినిమాతో ఈ ప్రయోగం చేస్తే బాగుంటుందని నా ఆలోచన. మీరేమంటారు?


Saturday 1 August 2015

బాహుబలి - The Grand Plate Meals

Baahubali

ఫైవ్ స్టార్ హోటల్‌కి బఫే కోసం అని వెళితే ప్లేట్ మీల్స్ పెట్టి పంపిస్తే ఎలా ఉంటుంది? పంచ భక్ష్య పరమాన్నాలతో కూడిన బ్రహ్మాండమైన విందు భోజనం అని పిలిచి ప్లేట్ చిన్నదిగా ఉంది, కొన్ని ఐటెంస్ మాత్రమే ఇవ్వాళ తినండి, మిగిలిన వాటికి రేపు మళ్ళీ రండి అని రూల్ పెడితే ఎలా ఉంటుంది? బాహుబలి సినిమా మొదటి భాగం అలాగే ఉంది. కథని అర్థంతరంగా ఆపేసి రెండో భాగం వచ్చే ఏడాది చూడండి అంటే, టివిలో సిన్సియర్‌గా డైలీ సీరియళ్ళు చూసేవాళ్ళకి బానే ఉంటుందేమో కాని, సగటు సినిమా ప్రేక్షకుడికి కడుపు నిండదు.

సినిమాని రెండు భాగాలుగా చెయ్యడంవల్ల ప్రేక్షకుడు అసంతృప్తిగా హాలు నుండి బయటికొస్తాడు. విలన్‌పై హీరో విజయం సాధించి శుభం కార్డు పడితేనే సినిమా పూర్తయినట్టు భావించడం మనకి అలవాటు. మూడు గంటల సమయం తీసుకున్నా, కొన్ని సన్నివేశాల నిడివి తగ్గించి, మొత్తం కథని ఒకే సినిమాగా చూపించి ఉంటే బాగుండేది. లేకపోతే కొంత కథని వర్తమానంలోనూ, కొంత ఫ్లాష్ బాక్ కథని చూపించే బదులు, మొదటి భాగంలో అమరేంద్ర బాహుబలి కథని మొత్తం చూపించి, రమ్యకృష్ణ బాలుడిని నది దాటించే సన్నివేశం దగ్గర మొదటి భాగం ముగిస్తే బాగుండేది. రెండో భాగంలో శివుడి కథని మొదలుపెట్టి పగ తీర్చుకోవడంతో పూర్తిచేస్తే ఏ భాగానికా భాగం ఇండిపెండెంట్‌గా, ఇంచుమించు సమగ్రంగా ఉండేది. వీలైతే మరిన్ని సీక్వెల్స్ కూడ తీసుకోవచ్చు.

సినిమాలో చాలా దృశ్యాలు, సన్నివేశాలు అద్భుతంగా ఉండి కనువిందు చేసాయి. రమ్యకృష్ణ బాలుడిని నది దాటించే ప్రయత్నం, జలపాతాలు, ప్రభాస్ శివలింగాన్ని భుజానికెత్తుకోవడం, ప్రభాస్ తమన్నాల యుగళగీతం, మాహిష్మతి రాజ్య నగర దృశ్యాలు, రానా విగ్రహాన్ని నిలబెట్టే సన్నివేశం, యుద్ధ సన్నాహాలు, కాలకేయుడితో యుద్ధ సన్నివేశాలు, ఇలా చాలా సీన్లు రిచ్‌గా, గ్రాండ్‌గా తీసారు. పోరాట దృశ్యాలు చాలానే ఉన్నాయి. కొన్ని బాగున్నాయి కాని, మరి కొన్నింటి నిడివి మరీ ఎక్కువై కథ నెమ్మదిగా జరగడానికి కారణమయ్యాయి.

సన్నివేశాలు వేటికవి విడిగా చూస్తే గొప్పగా ఉన్నాయి కాని, వాటినన్నింటినీ సరిగ్గా కలపవలసిన కథ బలంగా లేదు. సీన్లు రిచ్‌గా తియ్యడంలో పెట్టిన శ్రద్ధ స్క్రిప్టుపై పెట్టలేదనిపిస్తుంది. కథ మామూలు చందమామ కథే. అది కూడ గతంలో మగధీర సినిమాలో చూసిన కథే. అక్కడ అరగంటలో చెప్పిన కథని ఇక్కడ అయిదు గంటలకు విస్తరించారు. కాని మగధీరలో ఉన్నంత ఆసక్తికరంగా బాహుబలిలో చూపించలేకపోయారు. కాకపోతే ఇటువంటి పాత్రని రాం చరణ్ కంటే బాగా చెయ్యగలనని ప్రభాస్ నిరూపించాడు.

నటీనటుల విషయానికి వస్తే ప్రభాస్, రాణా, రమ్యకృష్ణ, సత్యరాజ్, ఇలా ఇంచుమించు పాత్రధారులంతా చాలా బాగా చేసారు. కాని సినిమాలో పాటలు గొప్పగా లేవు. పచ్చబొట్టు పాటైతే డబ్బింగ్ సినిమా పాటలా ఉంది. రాజమౌళి బియాండ్ కీరవాణి ఆలోచిస్తే బాగుంటుంది. మాటలు చాలా తక్కువగా ఉన్నాయి కాని, కొన్ని బాగున్నాయి.

నాకు ఇంగ్లీష్ సినిమాలు చూసే అలవాటు పెద్దగా లేదు కాబట్టి నాకు తెలియదు కాని, చాలా సన్నివేశాలు వివిధ ఇంగ్లీష్ సినిమాలనుండి కాపి కొట్టారని అంటున్నారు. అదే నిజమయినా మనం చిన్నపుడు చదువుకున్న చందమామ కథల లాంటి ఒక భారతీయ కథని మన భాషలో ఇంత ఘనంగా చూపించినందుకు రాజమౌళిని, నిర్మాతలని అభినందించాలి. ఎప్పుడూ చూసే రొటీన్ పగ సాధింపు సినిమాల కంటే ఈ సినిమా చాలా బెటర్. చివరలో చిన్న సందేహం. కాలకేయుడి భాష వేరేదైనప్పుడు అతని పేరు కూడ ఆ భాషలోనే ఉండాలి కదా!


 

Wednesday 7 January 2015

PK – OMG కన్నా పీకిందేమీ లేదు.


PK పీకిందేమీ లేదని అనడంలో ప్రాస కోసం తక్కువ స్థాయి భాష వాడడం నా ఉద్దేశం కాదు. ఈ రెండు సినిమాలలోనూ, దర్శకులు చేసింది కోడిగుడ్డుకి ఈకలు పీకడమే. కాకపోతే OMGలో కాస్త ఎక్కువ ఈకలు పీకారు. PKలో అంత ఎక్కువ పీకక పోయినా, నిరసనలు మాత్రం విపరీతంగా ఉన్నాయి. నా దృష్టిలో PK సినిమాలో నిషేధించవలసినంత "దృశ్యం" ఏమీ లేదు. భయపడేవాడే మందిరానికి వెళతాడని అన్నప్పుడు, మందిరం అన్న మాటకి అర్థం గుడి అని మాత్రమే కాకుండా ఏ మతానికి చెందిన ప్రార్థనా మందిరమైనా అని తీసుకోవాలని నా అభిప్రాయం. OMG సినిమాలోనే ఇంతకంటే ఎక్కువ విమర్శలు, వెటకారాలు, హేళనలు, వితండవాదనలు ఉన్నాయి. అయితే సినిమా చివరిలో కొన్ని సద్విమర్శలు కూడ ఉన్నాయి. అసలు OMG సినిమా ఇప్పటికే వచ్చిన తరువాత PK సినిమా తీయవలసిన అవసరమే లేదు. చాలా వరకు అదే కాన్సెప్టు, అదే సన్నివేశాలు PKలో కూడ ఉన్నాయి. OMG కాన్సెప్టుకి ఒక గ్రహాంతర వాసిని, ఒక ప్రేమ కథని కలిపారు అంతే. క్లైమాక్స్ కూడ చప్పగా టివి కార్యక్రమంలా ఉంది. PK తో పోలిస్తే, చెప్పదలుచుకున్న విషయాన్ని OMG లోనే సూటిగా సుత్తి లేకుండా చెప్పారు. అలాగే ఈ సినిమాకి PK అని ఇంగ్లీష్ అక్షరాల పేరు పెట్టి ప్రేక్షకులని కన్‌ఫ్యూజ్ చేయడం ఎందుకు? హిందీలో "పీకే" అని పెట్టవచ్చు కదా. ఆమిర్‌ఖాన్, హీరాని, వినోద్ చోప్రాల మీద నాకు గౌరవం ఉంది. వీళ్ళు అందరిలా మాస్ మసాలా సినిమాలు కాకుండా, కొంతైనా వైవిధ్యంగా ఉండే సినిమాలు తీస్తారు. కాని ఈ సినిమాలో అది లేదు. OMG సినిమాని రీమిక్స్ చేసి వదిలారంతే.

 

ఇప్పటివరకు వచ్చిన సినిమాలలో గ్రహాంతరవాసులు అంటే మనుషుల్లా కాకుండా ప్రత్యేక ఆకారంలో ఉన్నట్టు, వాళ్ళు మనకంటే చాలా అడ్వాన్సుడుగా ఉన్నట్టుగా చూపించారు. వాళ్ళు భూమి మీదకు రాగలిగారంటే, మన కంటే తెలివైన వాళ్ళు, ఎక్కువ టెక్నాలజీ తెలిసిన వాళ్ళు అయి ఉండాలి కదా! అలాగే ఇక్కడకు వచ్చే ముందు ఇక్కడి పరిస్థితులని ముందే అవగాహన చేసుకునే ఉండాలి కదా! కాని ఈ సినిమాలో ఆ గ్రహాంతరవాసి చాలా అయోమయంగా భూమి మీదకు వస్తాడు. ఆ మాత్రానికి గ్రహాంతరవాసి బదులు ఏ ఆదిమానవుడో అడవుల్లోంచో, హిమాలయాల్లోంచో వచ్చినట్టు చూపించవచ్చు.

   

ఈ సినిమాలో ఇంకో మిస్టేక్ ఏమిటంటే, పీకే కి ఎదుటి వ్యక్తుల చేతులు పట్టుకుని, వాళ్ళ మనసులో ఉన్న విషయాలన్నీ చదివే శక్తి ఉంటుంది. మరి అలాంటప్పుడు తాను పోగొట్టుకున్న రిమోట్ కోసం సంజయ్ దత్ అండతో రిమోట్ దోచుకున్న వ్యక్తిని పట్టుకుని, అతని చేతుల ద్వారా రిమోట్ ఎవరికి అమ్మాడో తెలుసుకోవచ్చు కదా! రిమోట్ ఎవరి దగ్గర ఉందో తెలుసుకోవడానికి దిల్లీ మహానగరం అంతా తిరగడం ఎందుకు? నీ రిమోట్ ఎక్కడ ఉందో దేవుడికే తెలియాలి అని దారిన పోయే దానయ్యలు చెప్పిన మాట పట్టుకుని, గుళ్ళూ గోఫురాలు తిరిగి దేవుడిని అన్వేషించడం, దేవుడు కనపడుటలేదని కరపత్రాలు పంచిపెట్టి విమర్శించడం, ఇవన్నీ ఎందుకు?


ఈ రెండు సినిమాలు తీసిన వాళ్ళు గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే, నమ్మకం వేరు, మూఢ నమ్మకం వేరు. ఇక్కడ మతం నమ్మకం. కొన్ని ఆచారాలు, సంప్రదాయాలు మూఢ నమ్మకాలు. అలాగే దేవాలయం నమ్మకం, ఆశ్రమం మూఢ నమ్మకం. నమ్మకాన్ని గౌరవించాలి. నమ్మకాన్ని విమర్శించడం అనవసరం. విమర్శించినా పద్ధతిగా విమర్శించాలి. హేళన చెయ్యకూడదు. నమ్మకాన్ని ఎవరైనా విమర్శించినా, ప్రజలు పట్టించుకోరు. తమ విశ్వాసాలని వదులుకోరు. మూఢ నమ్మకాలని తీవ్రంగా విమర్శించవచ్చు. దాని వలన కొంతమందైనా హేతుబద్ధంగా ఆలోచించి మూఢ నమ్మకాలు వదులుకుంటారు. అలాగే దేవుడు నమ్మకం, స్వాములు, బాబాలు మూఢ నమ్మకం. నా దృష్టిలో ఈ స్వాములు, బాబాలు దైవసమానులు (GOD MEN) కారు. వీళ్ళు కేవలం దళారులు. వీళ్ళ దగ్గరకు వెళ్ళే వాళ్ళు అమాయకులు, అజ్ఞానులు అయినా అయి ఉండాలి లేకపోతే ఆ వ్యవహారంలో స్వప్రయోజనం ఉన్న స్వార్థపరులు అయినా అయి ఉండాలి. కాని ఈ సినిమాలలో దేవుళ్ళనీ, బాబాలనీ ఒకే గాటన కట్టి ఇష్టమొచ్చినట్టు విమర్శించడం వలన సమాజంలో ఎటువంటి మార్పూ రాదు.


ఇలాంటి సబ్జెక్టుల మీద సినిమాలు తీస్తే సీరియస్‌గా తియ్యాలి కాని కామెడీ కోసం, వినోదం కోసం తియ్యకూడదు. వినోదం కోసం తీస్తే వివాదాస్పద అంశాలు లేకుండా చూసుకోవాలి. వినోదం కోసం తియ్యడం వలన ఆశించిన ప్రయోజనం కూడ నెరవేరదు. ప్రేక్షకులు సినిమా చూసి ఆనందిస్తారు కాని ఆలోచించరు. ఒకసారి 1985లో టి. కృష్ణ దర్శకత్వంలో వచ్చిన దేవాలయం సినిమా గుర్తుకు తెచ్చుకోండి. అందులో హీరో కూడ మొదట నాస్తికుడే. దేవుడు ఉన్నది నిజం అయినా కాకపోయినా, దేవాలయం ఉన్నది నిజం అని అర్థం చేసుకుని, తప్పనిసరి పరిస్థితులలో పూజారిగా బాధ్యతలు నిర్వహిస్తాడు. దేవాలయాన్ని దోచుకుంటున్న దుర్మార్గుల ఆట కట్టిస్తాడు.


ఈ PK సినిమా కథని రాఘవేంద్రరావు లాంటి కమ్మర్షియల్ దర్శకుడు సినిమాగా తీస్తే ఎలా ఉంటుంది? చాలా వినోదాత్మకంగా ఉంటుంది. ఎటువంటి గొడవలు, నిరసనలు ఉండవు. అవును, ఆయన ఇలాంటి కథతోనే ఒక సినిమా తీసాడు. అదే జగదేకవీరుడు - అతిలోకసుందరి. నాకైతే రెండు సినిమా కథలలో పెద్ద తేడా కనిపించలేదు. ఆ తెలుగు సినిమాలో శ్రీదేవి ఇంద్రలోకం నుండి భూమి మీదకు వచ్చి తన ఉంగరం (రిమోట్) పోగొట్టుకుంటుంది. ఆ ఉంగరం కోసం హీరో చిరంజీవి దగ్గరకు చేరుతుంది. ఆంజనేయ భక్తుడైన హీరో తన సంపాదనలో కొంత భాగం దేవుడికిస్తూ, కొంతమంది అనాథలని పోషిస్తూ ఉంటాడు. అక్కడా ఒక దొంగ స్వామి, అమ్రేష్ పురి ఉంటాడు. కాని హీరో దేవుడిని వెతుకుతూ కూర్చోకుండా, శక్తిమంతుడైన దొంగ స్వామిని చివరికి తన మానవశక్తితోనే అంతం చేస్తాడు.


PK సినిమా చివరిలో ఇంకో జోక్ ఏమిటంటే, టేప్ రికార్డర్ వినడానికి PK బోలెడన్ని బ్యాటరీలు భూమి మీద నుంచి పట్టుకెళతాడు. స్పేస్‌షిప్‌లో గ్రహాంతరయానం చెయ్యగలిగినవాళ్ళకి మన బ్యాటరీలు అవసరమా? లేక ప్రకటనల ఆదాయం కోసం అలా చూపించారా? నాకైతే యమగోల సినిమా చివరిలో అల్లు రామలింగయ్య అమాయకంగా పెట్టె నిండా పెన్నులు, సీసాలు మొదలైనవి తీసుకెళ్ళడం గుర్తొచ్చింది.

Friday 2 January 2015

బాబాయ్ అబ్బాయ్ - అతడు


"అతడు" సినిమాలో బ్రహ్మానందం, హేమ ల కాఫీ కామెడీ సీన్ గుర్తుంది కదా! ఆ సీన్‌ని ఒకసారి మళ్ళీ చూడండి.


   
 

ఇప్పుడు జంధ్యాల దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన "బాబాయ్ అబ్బాయ్" సినిమాలోని ఈ సన్నివేశం (46వ నిముషం నుండి) చూడండి.



   


 1985లో వచ్చిన ఈ పాత జంధ్యాల సినిమా సన్నివేశాన్ని త్రివిక్రం తన "అతడు" సినిమాలో బ్రహ్మానందం కి తగ్గట్టు ఇంప్రొవైజ్ చేసినట్టు ఉంది కదా!