Wednesday 30 May 2018

మహానటి సావిత్రి

సావిత్రి అంటే తెలుగు సినీ ప్రేక్షకులకి ఒక మహానటి. సావిత్రి అంటే పార్వతి, మిస్సమ్మ, దేవత లాంటి భార్య, గుండమ్మ సవతి కూతురు, సైరంధ్రి లాంటి అనేకమైన పాత్రలు. వీటన్నిటికి మించి సావిత్రి అంటే శశిరేఖ, సావిత్రి అంటే ఘటోత్కచుడు. ఈ నాటి హీరోయిన్లు ఎవరైనా నటన నేర్చుకోవాలంటే ఒక్క మాయబజార్ లోని సావిత్రిని చూసి నేర్చుకుంటే చాలు. అంతకంటే వేరే డిక్షనరీ, ఎన్‌సైక్లోపీడియా అవసరం లేదు. అయితే సావిత్రి తెర మీద అద్భుతంగా నటిస్తే, ఆమె బంధుమిత్రులు ఆమె ముందే ఇంకా బాగా నటించి ఆమెని మోసం చెయ్యటం విధివిలాసం.



 

నాగ్ అశ్విన్ మొదటి సినిమా "ఎవడే సుబ్రహ్మణ్యం" చూసినప్పుడే నేను అతని అభిమాని అయిపోయాను, అంత బాగా తీసాడు ఆ సినిమాని. చాలా సిన్సియర్‌గా తీసాడు. అలాంటి దర్శకుడు సావిత్రి బయోపిక్ తీస్తున్నాడంటే ఆశ్చర్యపోయాను. గత సినిమా అనుభవరీత్యా, అతను ఒక బయోపిక్ తీస్తున్నాడంటే ఏడు ఖండాలలోని ఏడు శిఖరాలు అధిరోహించిన మన తెలుగు వాడు, కీర్తిశేషుడు మల్లి మస్తాన్ బాబు బయోపిక్ తియ్యాలి. ఇప్పుడు సావిత్రి బయోపిక్ తీసినా, తరువాతైనా మస్తాన్ బాబు బయోపిక్ తియ్యాలని కోరుకుంటున్నాను. మస్తాన్ బాబు బయోపిక్ తీస్తే అది ఆ పర్వతారోహకుడికి సరైన నివాళి అవుతుంది. అది నాగ్ అశ్విన్ మాత్రమే చెయ్యగలడు.

నవతరం నిర్మాతలు, దర్శకుడు అలనాటి మహానటికి నివాళిగా ఈ సినిమా నిర్మించడం అభినందనీయం. సావిత్రి జీవితగాథ సినిమాగా తియ్యాలంటే, ఎంతో ధైర్యం, ఆత్మవిశ్వాసం ఉండాలి. ఇక్కడ నిర్మాత, దర్శకులకి అవి మెండుగా ఉన్నాయి. సరిగ్గా తియ్యకపోతే అభాసుపాలయ్యేవారు. హీరోయిన్‌గా కీర్తి సురేష్‌ని ఎంచుకోవడంతోనే వాళ్ళకి సగం పని అయిపోయింది. ఇక మిగిలిన పాత్రలు, పాత్రధారులని ఎంచుకుని, ఏ పాత్రతో ఎంతవరకు చేయించుకోవాలో, సినిమాలో ఏ సన్నివేశాలు చూపించాలో నిర్ణయించుకోవడం మిగతా సగం పని. దర్శకుడు నాగ్ అశ్విన్ ప్రేక్షకులని టైమ్ మెషిన్లో కూర్చోబెట్టి, కొన్ని దశాబ్దాలు వెనక్కి తీసుకెళ్ళాడు. ఆనాటి సమాజం, వ్యక్తులు, మాటలు, నగరాలు, భవనాలు, సినిమాలు అన్నీ వీలైనంత సహజంగా రూపొందించారు. అప్పటి స్టూడియోలు చూస్తుంటే, పదేళ్ల క్రితం షారూఖ్, దీపిక నటించిన ఓం శాంతి ఓం సినిమా గుర్తొస్తుంది మనకి.

కీర్తి సురేష్ నటన ఈ సినిమాకి ప్రధాన అకర్షణ. ఆమె అంత బాగా నటించింది. ఈ రోజుల్లో అలాంటి నటి దొరకడం దర్శకుని అదృష్టమనే చెప్పాలి. మనం సినిమాలలో చూడని టీనేజ్ సావిత్రిగా చిలిపితనంతో నటించిన సన్నివేశాలు ఇంకా బాగున్నాయి. అయితే సావిత్రి నటించిన సినిమా సన్నివేశాలు, వాటికి ముందు తెర వెనుక విశేషాలు మరి కొన్ని చూపించి ఉంటే ఇంకా బాగుండేది. మిగతా నటీనటులలో నాకైతే రాజేంద్రప్రసాద్ మాత్రమే నచ్చాడు. దుల్కర్ సల్మాన్ బాగానే చేసినా, ఎందుకో మన ప్రేక్షకులకి కనక్ట్ అవ్వలేదనిపించింది. అతని రూపం కూడ జెమినీ గణేశన్‌కి సూటవ్వలేదు. మిగిలిన పాత్రలన్నీ వచ్చి పోయేవే. సినిమా అయిపోయిన తరువాత గుర్తుండవు. సంగీతం, మాటలు, పాటలు బాగున్నాయి. మొత్తంగా ఫొటోగ్రఫీ బాగున్నా, 1980ల నాటి దృశ్యాలలో మసకగా ఉంది. మా మూవీస్ HD చానల్ చూస్తూ, మధ్యలో ETV సినిమా చానల్ చూసినట్టుంది.

అయితే సినిమా ఎంత బాగున్నా, కొన్ని అనవసర విషయాలు కలపడం బాగోలేదు. సమంత, విజయ్ దేవరకొండ ల పాత్రల అవసరమేమిటో నాకు అర్థం కాలేదు. యువత కోసం ఈ పాత్రలని పెట్టారని కొంతమంది అంటున్నారు. ఇది ఒక సినిమా టెక్నిక్ అయ్యుండవచ్చు కాని, మామూలు ప్రేక్షకులకి నచ్చదు. ఎవరైనా ఈ సినిమాకి సావిత్రిని చూడడానికి మాత్రమే వస్తారు. విజయ్ యాస ఇలాంటి పాత కాలం సినిమాలకి అస్సలు నప్పదు. వీళ్ళ పాత్రలతో ఖర్చయిన సమయాన్ని మరిన్ని సావిత్రి సినిమా షూటింగుల విశేషాలతో ఇంకా బాగా ఉపయోగించుకోవచ్చును. అవి ప్రేక్షకులకి ఆసక్తికరంగా కూడ ఉంటాయి. సమయాభావం వల్ల కొన్ని సీన్లు తీసి కూడ వదిలేసారని విన్నాను. ఇలా అంటున్నందుకు క్షమించండి, మహానటి సినిమా చూద్దామని వస్తే ఈ మహా నత్తి గొడవేమిటో నాకర్థం కాలేదు.

ఈ సినిమా చూడడానికి కొద్ది రోజుల ముందు నేను సావిత్రి జీవితం గురించి పల్లవి గారు వ్రాసిన నవల చదివాను. నవలలోని సన్నివేశాలు చాలా వరకు సినిమాలో చూపించినా ఎందుకనో అందులోని ఒక ముఖ్య పాత్రని వదిలేసారు. ఆ పాత్ర పేరు చాముండి. ఆ పాత్ర నిజమైనదో, కల్పితమో నాకు తెలియదు కాని, సావిత్రి జీవితంలో చాలా ప్రాధాన్యమున్న పాత్ర. జయలలిత జీవితంలో శశికళ లాంటి వ్యక్తి ఆమె. సావిత్రికి తెర వెనుక, నిజ జీవితంలో అన్ని వేళలా సహాయపడిన వ్యక్తి. సావిత్రి మద్రాస్ వచ్చినప్పటినుండి అడుగడుగునా ఆమెకు అక్కలా తోడు ఉంటుంది. అవసరమైనప్పుడు జెమిని గణేశన్‌తో కూడ గొడవపడి సావిత్రికి మద్దతుగా నిలుస్తుంది. అలాంటి పాత్రని సినిమాలో ఉంచి, సమంతకి ఇచ్చి ఉంటే, సమంత ఆ పాత్రకి న్యాయం చేసి మంచి పేరు తెచ్చుకునేది.

నాగేశ్వరరావు, S V రంగారావు లాంటి కొద్దిమందినే సినిమాలో చూపించారు. SVR గా మోహన్‌బాబు బాగానే ఉన్నా, ANR గా నాగ చైతన్య సరిగ్గా కుదరలేదు. బహుశా సుమంత్ ఇంకా బాగుండచ్చు. NTR గా తారక్ కూడ చేసి ఉంటే సినిమా మరింత ఆకర్షణీయంగా ఉండేది. శివాజీ గణేశన్ లేడని తమిళ ప్రేక్షకులు కూడ అసంతృప్తి చెందారు. అందరికంటే ముఖ్యమైన సూర్యకాంతం లేకపోవటం సినిమాలో పెద్ద లోటు. ఇలాంటి సినిమాలు ఎంత బాగా తీసినా, ఇంకా ఏదో కొంత మిగిలిపోతూనే ఉంటుంది కాబట్టి ఉన్నది చూసి ఆనందించెయ్యాలి. అంతే!

Thursday 26 April 2018

భరత్ అనే లీడర్

ఈ మధ్య మహేష్‌బాబు సినిమాలు చూడడానికి ముందు సినిమా ఎలా ఉందో తెలుసుకుని మరీ వెళ్ళాల్సివస్తోంది. “భరత్ అనే నేను” సినిమాకి ఇంచుమించు అన్ని వెబ్‌సైట్లలో మంచి రేటింగ్ ఇచ్చి మహేష్ అద్భుతంగా చేసాడని వ్రాసారని, ఈ సినిమా మొన్న ఆదివారం చూసాము. కాని ఈ సినిమా ఇంతకు ముందు చూసిన “లీడర్” సినిమా లానే ఉంది. ఇకముందు మీడియాలో వచ్చే రివ్యూలు చదవకుండా పబ్లిక్ టాక్ ని బట్టి వెళ్ళాలి. అంత ఇదిగా రివ్యూలు వ్రాస్తున్నారు.

ఇంతకీ ఈ సినిమాకి “భరత్ అనే లీడర్” అని టైటిల్ పెట్టి ఉంటే బాగుండేది. ఎందుకంటే గతంలో వచ్చిన “లీడర్” సినిమాని అంతగా అనుకరించేసారు. పాపం శేఖర్ కమ్ముల! ఎందుకనో గమ్మునున్నాడు. ఒక ముఖ్యమంత్రి చనిపోతే విదేశంలో ఉన్న అతని కొడుకుని తీసుకువచ్చి ముఖ్యమంత్రిని చెయ్యటం, అతను ఇక్కడి నాయకులతో పోరాడి వ్యవస్థలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నించడం అన్నదే రెండు సినిమాలలోనూ ఉన్న ప్రధాన కథ. ఇంచుమించు “లీడర్” సినిమాలోని పాత్రలే ఇందులో కూడ ఉన్నాయి. సుమన్ పాత్రలో శరత్ కుమార్, కోట పాత్రలో ప్రకాష్‌రాజ్, సుహాసిని పాత్రలో సితార, హర్షవర్ధన్ పాత్రలో బ్రహ్మాజి ఇలా ఆఖరికి గొల్లపూడి పాత్రలో దేవదాస్ కనకాల వరకు చాలా అనుకరించారు.

ఇంకా కొన్ని సీన్లు అంతకంటే ముందు వచ్చిన శంకర్ సినిమా “ఒకే ఒక్కడు” నుంచి తీసుకున్నారు. కాని కథ విషయానికి వస్తే ఆ రెండు సినిమాలే ఈ సినిమా కన్నా నయం. ఒకేఒక్కడు, లీడర్ సినిమాలలో హీరో పాత్రలకి ఒక లక్ష్యం, దాని పట్ల నిబద్ధత, నిజాయితీ ఉంటాయి. ఈ సినిమాలో హీరోకి మాత్రం వినోదమే లక్ష్యం. అతను చూపించే పరిష్కారాలు కూడ సినిమాటిక్ గానే ఉంటాయి కాని లాజికల్‌గా, ప్రాక్టికల్‌గా ఉండవు. అలాగే ఈ సినిమాలో కొన్ని తప్పులు కూడ ఉన్నాయి. ఉదాహరణకి సినిమా 2014కి ముందు జరిగిందని చెప్పారు. కాని కొన్ని టివి స్క్రోలింగులలో ఇప్పటి వార్తలు కనపడతాయి.

అయినా ఈ సినిమా ఇంతగా హిట్టవ్వడానికి కారణం ఏమిటంటే ఒక మామూలు కమర్షియల్ సినిమాలో ఉండాల్సిన మాస్ ఫార్ములాలన్నీ చక్కగా ఉన్నాయి. సంగీతం, పాటలు, డైలాగ్స్ బాగున్నాయి. కొన్ని సన్నివేశాలు బాగా తీసారు. మహేష్‌బాబుని చాలా స్టైలిష్‌గా చూపించారు. పూర్తిగా వినోదభరితంగా ఉంది. కాని వచ్చిన సమస్య ఏమిటంటే ఇలాంటి ఫార్ములాలు అన్నీ సినిమాలో ఉండాలనుకున్నప్పుడు హీరో మరీ ముఖ్యమంత్రిగా కాకుండా ఒక MLA గానో, మంత్రిగానో, పోలీస్ గానో, కలక్టర్‌గానో, మరో వృత్తిలోనో ఉండి ఉంటే బాగుంటుంది. మసాలా సరిగ్గా సమకూరినప్పుడు అది వంకాయ కూర అయితే ఏమిటి? దొండకాయ కూర అయితే ఏమిటి? ఎంత యువకుడయినా ఒక  ముఖ్యమంత్రి రొమాన్స్, ఫైట్లు చెయ్యడం బాగోలేదు. గత రెండు సినిమాలలో కూడ ఇవి ఉన్నా, అవి కాస్తో కూస్తో సందర్భోచితంగా ఉన్నాయి. ఆ మధ్య హిందీలో అమీర్‌ఖాన్ కూడ ఇలాగే OMG (తెలుగులో గోపాల, గోపాల) సినిమా కథకి కొంత నేపధ్యం మార్చి, ఇంచుమించు అవే సన్నివేశాలతో PK సినిమా తీసి పెద్ద హిట్టు కొట్టాడు. (ఆ సినిమా గురించి ఇక్కడ చదవండి) కాని దాని ద్వారా ప్రేక్షకులకు కొత్తగా చెప్పేది ఏముంది?  

గతంలో హీరో కృష్ణ నటించిన “ఈనాడు” (1982) సినిమాలో హీరోయిన్ కూడ ఉండదు. ఆ సినిమాలో హీరో సొంత బావ అయిన మంత్రితో నమ్మిన సిద్ధాంతాల కోసం పోరాడతాడు. ప్రజలు, వ్యవస్థలకు సంబంధించి సినిమా తీయాలనుకున్నప్పుడు, వీలైనంత వరకు ఫార్ములాకు దూరంగా ఉంటే బాగుంటుంది. ఇదే కొరటాల శివ దర్శకత్వం వహించిన “జనతా గారేజ్” సినిమాలో తన ఆశయం కోసం హీరో తన ప్రేమని కూడ వదులుకుంటాడు. అప్పుడే హీరో వ్యక్తిత్వం నిలబడేది. ఈ దర్శకుడే తీసిన “శ్రీమంతుడు” సినిమాలో కూడ హీరో తన ఊరు గురించి తెలుసుకుని, ఆ ఊరి సమస్యలని పరిష్కరిస్తాడు. అయితే ఆ సినిమా కథ కూడ చాల వరకు 1984లో K. విశ్వనాథ్ తీసిన “జననీ జన్మభూమి” సినిమా కథలాగే ఉంటుంది. శివ గారు, సందేశం ఇవ్వాలనుకున్నప్పుడు దానికి కొంత సుగర్ కోటింగ్ అవసరమే, కాని మసాలా ఎక్కువైతే ఎబ్బెట్టుగా ఉంటుంది.

Wednesday 14 June 2017

భళి భళి రా.. రాజమౌళి.

బాహుబలి ది కంక్లూజన్. ఈ మధ్య కాలంలో ఒక సినిమాని రెండోసారి థియేటర్‌కి వెళ్ళి చూసిన సందర్భం ఇదే. 21వ శతాబ్దం ప్రారంభం నుండి టివిలో సినిమాలు ఎక్కువగా రావడం మొదలయ్యాకా చాలామంది థియేటర్లకి వెళ్ళడం తగ్గించేసారు. ఎప్పుడైనా మంచి సినిమాలు వచ్చినపుడు ఒకసారి థియేటర్‌కి వెళ్ళి చూసినా, రెండోసారి వెళ్ళడం అరుదే. బాహుబలి 2 సినిమాని నేను మొదట ఐమాక్స్ తెరపై చూసాను. అద్భుతంగా అనిపించింది. మళ్ళీ ఇంకోసారి చూడాలనిపించి ప్రయత్నిస్తే ఇప్పటికి కుదిరింది. కాని మామూలు తెరపై చూడాల్సివచ్చింది. అయినా అద్భుతంగానే అనిపించింది.

నిజానికి ఇదేమీ గొప్ప కధేమీ కాదు. చిన్నప్పుడు చందమామలో చదువుకున్న అనేకానేక జానపదకథల్లాంటిదే. రామారావు, కాంతారావు, రాజనాల నటించిన ఎన్నో పాత సినిమాలు ఇలాగే ఉంటాయి. కాని ఈ సినిమాని రాజమౌళి తెరకెక్కించిన విధానమే ఈ సినిమాని గొప్ప స్థాయికి తీసుకువెళ్ళింది. అందుకే ఈ సినిమా కథ గురించి కాకుండా సినిమాలోని పాత్రల గురించి వ్రాస్తే బాగుంటుందనిపించింది. సినిమాలోని పాత్రలన్నీ కూడ రామాయణం, భారతం లోని పాత్రలని గుర్తుచేస్తూ ఉంటాయి. ముఖ్యమైన పాత్రలన్నింటిని చాలా శ్రద్ధగా తీర్చిదిద్దారనిపిస్తుంది. అలాగే పాత్రలకి న్యాయం చేసే సరి అయిన నటీనటులని ఎన్నుకుని ఆ పాత్రలకి సహజత్వం తీసుకొచ్చాడు రాజమౌళి.

శివగామి: ఈ సినిమాలో అన్నింటి కన్నా ముఖ్యమైన పాత్ర ఇది. గాంధారి + కుంతి + కైకేయి = శివగామి. అయితే కుంతి పాత్రని చంపేసి ఆ పాత్రని కూడ శివగామి పాత్రలో కలిపేసారు. తోడికోడలి కొడుకు బాహుబలిని తన కన్నబిడ్డతో సమానంగా పెంచిపెద్ద చేస్తుంది శివగామి. తన కొడుకుకు రాజు అయ్యే అర్హత లేదని తెలిసి, బాహుబలిని రాజుని చేస్తుంది. కాని కైకేయిలా చెప్పుడుమాటలు విని బాహుబలిని బయటికి పంపించి తన కొడుకుని రాజుని చేస్తుంది. చివరికి తన తప్పు తెలుసుకుని బాహుబలి కొడుకుని రక్షిస్తుంది. అక్కడక్కడ ఇందిరాగాంధిని కూడ గుర్తు చేస్తుంది ఈ శివగామి పాత్ర. ఈ పాత్రకి రమ్యకృష్ణ తప్ప మరెవ్వరూ న్యాయం చెయ్యలేనంత అద్భుతంగా నటించింది.

కట్టప్ప: శివగామి తరువాత అంత ముఖ్యమైన పాత్ర కట్టప్పది. భీష్ముడు + కర్ణుడు = కట్టప్ప. మూడు తరాలని చూసిన వృద్ధ వీరుడు కట్టప్ప. వంశాచారం ప్రకారం రాజరికానికి బందీగా పనిచేస్తూ మంచితనానికి మద్దతు ఇవ్వలేక కుమిలిపోయే భీష్ముడి లాంటి పాత్ర. అలాగే తను నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి దుష్టుడైన భల్లాలదేవుని కాపాడడానికి తన ప్రాణాన్ని కూడ పణంగా పెట్టే కర్ణుడు లాంటివాడు. ఈ పాత్రకి సత్యరాజ్ పూర్తిగా న్యాయం చేసాడు. కాని ఈ పాత్రకి న్యాయం చేసే కేరక్టర్ ఆర్టిష్ట్ తెలుగులో దొరకకపోవడం దురదృష్టం. రంగనాథ్, శరత్‌బాబు తరువాత తెలుగులో మంచి సహాయనటులే కరువయ్యారు.

బాహుబలి: తండ్రీకొడుకులైన ఇద్దరు బాహుబలులని, ఇంచుమించు ఒకే విధంగా మలచారు. రాముడు + అర్జునుడు + భీముడు = బాహుబలి. తండ్రి మాట జవదాటని రాముడిలా శివగామి అజ్ఞని పాటిస్తూ వనవాసం వెళ్ళినట్లు రాజప్రాసాదాన్ని విడిచి జనావాసాలకి వెళతాడు బాహుబలి. మాయాజూదంలో ఓడిపోయిన పాండవులు కూడ ఇలాగే వనవాసం చేస్తారు. అర్జునుడు లాంటి వీరుడు, భీముడంతటి బలశాలి. అలాగే రాజు స్థానంలో ఎవరున్నా, ప్రజల మద్దతు మాత్రం ఎప్పుడూ బాహుబలికే ఉంటుంది. ప్రభాస్ తప్ప ఈ పాత్రకి ఇంకెవరినీ ఊహించలేము. రాజమౌళిని నమ్మి అన్నేళ్ళు ఈ చిత్రానికే కష్టపడి పని చేసినందుకు ప్రభాస్‌కి మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చాయి.

దేవసేన: సీత + ద్రౌపది = దేవసేన. సీతలా బాహుబలితో రాజప్రాసాదాన్ని విడిచి జనావాసానికి వెళుతుంది. అక్కడే లవకుశులకి జన్మనిచ్చినట్టు మహేంద్ర బాహుబలికి జన్మనిస్తుంది. తరువాత రావణుడు లాంటి భల్లాలదేవుడికి బందీగా మారి అశోకవనంలో సీతలా కొడుకు కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. అంతకుముందు ద్రౌపదిలా నిండుసభలో అవమానానికి గురవుతుంది. అనుష్క కూడ చాలా చక్కగా నటించి తన పాత్రకి న్యాయం చేసింది. ప్రభాస్‌కి సరైన జోడిగా కుదిరింది.

భల్లాలదేవుడు: రావణుడు + దుర్యోధనుడు = భల్లాలదేవుడు. దుర్యోధనుడిలా రాజ్యాధికారం కోసం ఎప్పుడు రగిలిపోతూ ఉంటాడు. సోదరుడు లాంటి బాహుబలితో కలిసి నడుస్తూనే కుట్రలు పన్నుతూ ఉంటాడు. భరతుడు దుర్యోధనుడిలాంటి వ్యక్తి అయితే ఎలా ఉంటాడో, అలా ఉంటాడు. తండ్రితో కలిసి తల్లిని కైకేయిలా మారుస్తాడు. అమరేంద్ర బాహుబలిని చంపించినా, కసి తీరక దేవసేనని రావణుడు బంధించినట్టు బంధిస్తాడు. దగ్గుబాటి రానా ప్రభాస్‌తో పోటీపడి తన పాత్రని బాహుబలికి దీటుగా నిలబెట్టాడు. క్లైమాక్స్‌లో మహేంద్ర బాహుబలి కన్నా వీరోచితంగా పోరాడతాడు.

బిజ్జలదేవుడు: ధృతరాష్ట్రుడు + శకుని = బిజ్జలదేవుడు. ధృతరాష్ట్రుడిలాగే తనకు దక్కనట్టు, తన కొడుకుకి కూడా సింహాసనం దక్కదేమోనని కుట్రలు పన్నుతూ ఉంటాడు. అవకాశం దొరికినప్పుడల్లా తన కుమారుడిని గొప్పగా చూపిస్తుంటాడు. శకునిలా కొడుకుతో దురాలోచనలు చేస్తుంటాడు. మంధరలా కైకేయి మనసు విరిచెయ్యాలని ప్రయత్నిస్తుంటాడు.

కుమారవర్మ: ఇది నర్తనశాలలో ఉత్తరకుమారుడు లాంటి పాత్ర. విరాటపర్వంలో అర్జునుడు గోగ్రహణం కోసం యుద్ధం చేస్తే ఇక్కడ సిల్లీగా పందులవేట చేస్తాడు బాహుబలి. అసలు ఈ కుమారవర్మ పాత్ర సినిమాకి అవసరం లేదు. అలాగే అవంతిక పాత్ర కూడ. ఈ రెండు పాత్రలు సినిమా నిడివి పెంచి రెండు భాగాలుగా చెయ్యడానికి, కాస్త వినోదం పంచడానికి తప్ప ఇంకెందుకూ పనికిరావు. కుమారవర్మగా సుబ్బరాజు తన వంతుగా బాగానే ప్రయత్నించినా, గొప్పగా చెయ్యలేకపోయాడు. కుమారవర్మ పాత్రకి సునీల్(వర్మ) అయితే బాగుండేది. కామెడీ ఇంకా సహజంగా ఉండేది. కమేడియన్ నుండి హీరోకి ఎదిగిన సునీల్ లాగానే కుమారవర్మ పాత్ర కూడ ఉంటుంది కాబట్టి సునీల్ అయితే బాగుండేది.

ఒక మామూలు జానపదకథలో ఇన్ని బలమైన పాత్రలు, వాటి మధ్య బలమైన ఎమోషన్స్ సృష్టించిన రచయిత విజయేంద్ర ప్రసాద్ అభినందనీయులు. అలాగే ఆ పాత్రలకు సరిపోయే నటీనటులని ఎన్నుకుని, వాళ్ళచేత అద్భుతంగా నటింపచేసిన దర్శకుడు రాజమౌళి ఇంకా అభినందనీయుడు. ముఖ్యంగా ఒక్కొక్క సన్నివేశాన్ని, శ్రద్ధగా సాంకేతిక అద్భుతంగా తీర్చిదిద్దినందుకు రాజమౌళి టీంని ప్రశంసించాలి. అందుకే ఈ సినిమాకి ప్రపంచమంతా గొప్ప పేరు ప్రఖ్యాతులు వచ్చాయి.
అయినా ఒక అసంతృప్తి ఏమిటంటే, ఇంత కష్టపడి, ఇంత ఖర్చు పెట్టి, ఒక కాల్పనిక కథని సినిమాగా తీసే బదులు ఒక పౌరాణిక లేదా చారిత్రక గాథని సినిమాగా తీసి ఉంటే చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయేదీ. రాజమౌళి భవిష్యత్తులో ప్రభాస్‌తోనే "అల్లూరి సీతారామరాజు" కథని యధాతథంగా, ఎటువంటి గ్రాఫిక్సు లేకుండా సినిమాగా తీసి మన తెలుగు వీరుడి చరిత్రని యావద్దేశానికి సగౌరవంగా గుర్తు చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం.

Saturday 5 December 2015

ఖలేజా సినిమాలో బ్లండర్.




ఈ వీడియో చూడండి. ఖలేజా సినిమా మొదట్లో సునీల్ ఒక టివి చానల్ తరపున డాక్యుమెంటరీ షూటింగ్ కోసం వేన్ మీద రాజస్థాన్‌లోని ఎడారికి వస్తాడు. అక్కడ తన అసిస్టెంట్స్‌తో మాట్లాడుతుండగా నేలలో ఇసుకలోంచి మహేష్ బాబు లేచి వస్తాడు. అది చూసి భయపడిన సునీల్ అసిస్టెంట్స్, వాళ్ళు వచ్చిన వేన్‌లో పారిపోతారు. అప్పుడు అందరూ రోడ్డు పక్కనే ఉంటారు. కాని వేన్ వెళ్ళిపోగానే సునీల్, మహేష్ బాబు పక్కనున్న రోడ్డువైపుకి వెళ్ళకుండా, కావాలని దారి తప్పినట్టు ఎడారిలోకి వెళతారు. పైగా అరిస్తే పారిపోయేవాళ్ళు అసిస్టెంట్లు కాదంటూ సగం పంచ్ డైలాగు ఒకటి వేస్తాడు మహేష్ బాబు. ఆ తరువాత ఇద్దరూ ఎడారి నుండి బయట పడడానికి దారి కోసం తిరుగుతూ, తిరుగుతూ అనుష్కని, అలీని కలిసి ఎప్పటికో మహేష్ కలవాల్సిన దిలావర్ సింగ్ కుటుంబాన్ని కలుస్తారు. పోనీ మహేష్‌బాబుకి ఎడారిలో దిలావర్ సింగ్ కుటుంబాన్ని వెదకాల్సిన పని ఉందనుకున్నా, సునీల్‌కి ఎడారితో పనేమిటి? తన అసిస్టెంట్స్‌ని వెతుకుతూ రోడ్డువైపే వెళ్ళాలి కదా!
మహేష్‌బాబు కూడ దిలావర్ సింగ్ కుటుంబాన్ని వెతకాలంటే ఎడారిలోనే దారి తప్పి వెతకాలా? లేక రోడ్డు మీద ప్రయాణిస్తూ ఆ ఊరిని వెతకాలా? ఆ రోడ్డు మీద, పక్కన ఒంటెలు కూడ తిరుగుతూ ఉంటాయి. కనీసం వాటి మీద ప్రయాణించి అయినా వెతక వచ్చు, కాని వీళ్ళు ఎడారికి అడ్డంపడి వెతుకుతూ ఉంటారు. 
      

Friday 20 November 2015

సాగర సంగమం - సరికొత్తగా...


సాగర సంగమం సినిమా విడుదలై ఇప్పటికి ముప్పయ్యేళ్ళు దాటింది. కళాతపస్వి విశ్వనాథ్ దర్శకత్వం, కమల్ హాసన్, జయప్రదల అద్భుత నటన, ఇళయరాజా - వేటూరిల మధురమైన పాటలు, జంధ్యాల మాటలు, ఈ చిత్రాన్ని భారతీయ చిత్రాల్లోనే గొప్పవైన 100 చిత్రాల్లో ఒకటిగా నిలబెట్టాయి.

సాగర సంగమం సినిమా చేసేటప్పటికి కమల్ వయసు ముప్పయ్యేళ్ళ లోపే. ఇప్పుడు కమల్ వయసు అరవయ్యేళ్ళ పైనే. అయినా కమల్ హాసన్ ఇంకా హీరోగా నటిస్తూ ప్రేక్షకులని మెప్పిస్తున్నాడు. ఇన్నాళ్ళ తన నటప్రస్థానంలో కమల్ అందుకోని అవార్డు, రివార్డు ఏమీ లేదనే చెప్పాలి. సాగర సంగమం సినిమాలో కమల్ పాతికేళ్ళ యువకుడిగా కొంతసేపూ, సుమారు అరవయ్యేళ్ళ పెద్దవాడిగా కొంతసేపూ కనిపిస్తాడు. సినిమా నిడివి పరంగా చూస్తే రెండు పాత్రలకి ఇంచుమించు సమానమయిన వ్యవధి ఉంటుంది. రెండు వయసుల పాత్రల్లోనూ కమల్ చక్కగా ఒదిగిపోయి అద్భుతంగా నటించాడు.

తెలుగువాళ్ళందరూ ఈ సినిమాని కొన్ని డజన్ల సార్లు చూసి ఉంటారు. అలాగే నేను కూడ ఎన్నో సార్లు చూసాను. అలా ఈ మధ్య మరోసారి టివిలో ఈ సినిమా చూస్తున్నపుడు నాకో సరదా ఆలోచన వచ్చింది. ఎందువల్లనంటే ఈ మధ్య ఏదో సినిమాకి వెళ్ళినప్పుడు కమల్ కొత్త సినిమా "చీకటి రాజ్యం" ట్రైలర్ చూపించాడు. అది చూసినపుడు అయ్యో కమల్ ముసలివాడయిపోతున్నాడే అని అనిపించింది.
సాగర సంగమం సినిమాలో కమల్ సగం సేపు యువకుడుగా, మిగతా సగం వయసు మళ్ళినవాడుగా కనిపిస్తాడు కదా. అలాంటప్పుడు కమల్ యువకుడిగా ఉన్న భాగాన్ని అలాగే ఉంచేసి, కమల్ వయసుమళ్ళినవాడిగా ఉన్న భాగాన్ని ఇప్పటి కమల్‌తో పునర్నిర్మించి కలిపితే ఎలా ఉంటుంది? నాకయితే చాలా బాగుంటుందనిపించింది.
కమల్‌తో పాటు జయప్రద కూడ ఇప్పుడు వయసులో పెద్దదయిపోయింది. ఇప్పుడు ఆ తల్లి వయసు పాత్రకి జయప్రద సరిగ్గా సరిపోతుంది. అలాగే శరత్ బాబు కూడ తన పాత్ర తానే చెయ్యవచ్చు. శరత్ బాబు ఈ మధ్య ఎక్కువగా నటించడం లేదు. ఆయన ఆరోగ్యంగానే ఉన్నారనుకుంటున్నాను. ఇక మిగిలిన ముఖ్యమైన పాత్ర, శైలజ పోషించిన జయప్రద కూతురు పాత్ర. ఇప్పుడు శైలజ ఆ పాత్రకి సరిపోదు కాబట్టి, కమల్ కూతురు శృతి హాసన్ అయితే బాగుంటుంది. నిజ జీవితంలో కమల్ కూతురు అయిన శృతి, సినిమాలో జయప్రద కూతురుగా నటిస్తే కమల్‌తో అనుబంధం బాగా వర్కవుటవుతుంది.
ఈ ఆలోచనని నా దగ్గరి స్నేహితులతో చర్చిస్తే, వాళ్ళకి అంతగా నచ్చలేదు. అప్పట్లోనే కమల్, జయప్రద ముసలివాళ్ళుగా బాగా చేసారు కదా, మళ్ళీ ఇప్పుడు రీషూట్ చెయ్యడం ఎందుకు? అన్నారు. నిజమే, అప్పుడే కమల్, జయప్రద చాలా బాగా చేసారు. కాని ఇప్పుడైతే వాళ్ళ శరీరం కూడ వయసుకు తగ్గట్టుగా కనపడుతుంది. మేకప్ పెద్దగా అవసరముండదు. జీవితానుభవం కూడ వాళ్ళ నటనలో మరింత సహజత్వాన్ని తెస్తుంది. అన్నింటిని మించి ఇది ఒక కొత్త ప్రయోగంలా ఉంటుందని నా అభిప్రాయం. కమల్ కూడ తన సినిమాలతో ఇలా ఎన్నో ప్రయోగాలు చేసాడు. ఇది మరో ప్రయోగం అవుతుంది. ఇలాంటి ప్రక్రియ మన దేశంలో కాని, విదేశాల్లో కాని ఎవరైనా చేసారో లేదో తెలియదు. సాగర సంగమం సినిమాతో ఈ ప్రయోగం చేస్తే బాగుంటుందని నా ఆలోచన. మీరేమంటారు?


Saturday 1 August 2015

బాహుబలి - The Grand Plate Meals

Baahubali

ఫైవ్ స్టార్ హోటల్‌కి బఫే కోసం అని వెళితే ప్లేట్ మీల్స్ పెట్టి పంపిస్తే ఎలా ఉంటుంది? పంచ భక్ష్య పరమాన్నాలతో కూడిన బ్రహ్మాండమైన విందు భోజనం అని పిలిచి ప్లేట్ చిన్నదిగా ఉంది, కొన్ని ఐటెంస్ మాత్రమే ఇవ్వాళ తినండి, మిగిలిన వాటికి రేపు మళ్ళీ రండి అని రూల్ పెడితే ఎలా ఉంటుంది? బాహుబలి సినిమా మొదటి భాగం అలాగే ఉంది. కథని అర్థంతరంగా ఆపేసి రెండో భాగం వచ్చే ఏడాది చూడండి అంటే, టివిలో సిన్సియర్‌గా డైలీ సీరియళ్ళు చూసేవాళ్ళకి బానే ఉంటుందేమో కాని, సగటు సినిమా ప్రేక్షకుడికి కడుపు నిండదు.

సినిమాని రెండు భాగాలుగా చెయ్యడంవల్ల ప్రేక్షకుడు అసంతృప్తిగా హాలు నుండి బయటికొస్తాడు. విలన్‌పై హీరో విజయం సాధించి శుభం కార్డు పడితేనే సినిమా పూర్తయినట్టు భావించడం మనకి అలవాటు. మూడు గంటల సమయం తీసుకున్నా, కొన్ని సన్నివేశాల నిడివి తగ్గించి, మొత్తం కథని ఒకే సినిమాగా చూపించి ఉంటే బాగుండేది. లేకపోతే కొంత కథని వర్తమానంలోనూ, కొంత ఫ్లాష్ బాక్ కథని చూపించే బదులు, మొదటి భాగంలో అమరేంద్ర బాహుబలి కథని మొత్తం చూపించి, రమ్యకృష్ణ బాలుడిని నది దాటించే సన్నివేశం దగ్గర మొదటి భాగం ముగిస్తే బాగుండేది. రెండో భాగంలో శివుడి కథని మొదలుపెట్టి పగ తీర్చుకోవడంతో పూర్తిచేస్తే ఏ భాగానికా భాగం ఇండిపెండెంట్‌గా, ఇంచుమించు సమగ్రంగా ఉండేది. వీలైతే మరిన్ని సీక్వెల్స్ కూడ తీసుకోవచ్చు.

సినిమాలో చాలా దృశ్యాలు, సన్నివేశాలు అద్భుతంగా ఉండి కనువిందు చేసాయి. రమ్యకృష్ణ బాలుడిని నది దాటించే ప్రయత్నం, జలపాతాలు, ప్రభాస్ శివలింగాన్ని భుజానికెత్తుకోవడం, ప్రభాస్ తమన్నాల యుగళగీతం, మాహిష్మతి రాజ్య నగర దృశ్యాలు, రానా విగ్రహాన్ని నిలబెట్టే సన్నివేశం, యుద్ధ సన్నాహాలు, కాలకేయుడితో యుద్ధ సన్నివేశాలు, ఇలా చాలా సీన్లు రిచ్‌గా, గ్రాండ్‌గా తీసారు. పోరాట దృశ్యాలు చాలానే ఉన్నాయి. కొన్ని బాగున్నాయి కాని, మరి కొన్నింటి నిడివి మరీ ఎక్కువై కథ నెమ్మదిగా జరగడానికి కారణమయ్యాయి.

సన్నివేశాలు వేటికవి విడిగా చూస్తే గొప్పగా ఉన్నాయి కాని, వాటినన్నింటినీ సరిగ్గా కలపవలసిన కథ బలంగా లేదు. సీన్లు రిచ్‌గా తియ్యడంలో పెట్టిన శ్రద్ధ స్క్రిప్టుపై పెట్టలేదనిపిస్తుంది. కథ మామూలు చందమామ కథే. అది కూడ గతంలో మగధీర సినిమాలో చూసిన కథే. అక్కడ అరగంటలో చెప్పిన కథని ఇక్కడ అయిదు గంటలకు విస్తరించారు. కాని మగధీరలో ఉన్నంత ఆసక్తికరంగా బాహుబలిలో చూపించలేకపోయారు. కాకపోతే ఇటువంటి పాత్రని రాం చరణ్ కంటే బాగా చెయ్యగలనని ప్రభాస్ నిరూపించాడు.

నటీనటుల విషయానికి వస్తే ప్రభాస్, రాణా, రమ్యకృష్ణ, సత్యరాజ్, ఇలా ఇంచుమించు పాత్రధారులంతా చాలా బాగా చేసారు. కాని సినిమాలో పాటలు గొప్పగా లేవు. పచ్చబొట్టు పాటైతే డబ్బింగ్ సినిమా పాటలా ఉంది. రాజమౌళి బియాండ్ కీరవాణి ఆలోచిస్తే బాగుంటుంది. మాటలు చాలా తక్కువగా ఉన్నాయి కాని, కొన్ని బాగున్నాయి.

నాకు ఇంగ్లీష్ సినిమాలు చూసే అలవాటు పెద్దగా లేదు కాబట్టి నాకు తెలియదు కాని, చాలా సన్నివేశాలు వివిధ ఇంగ్లీష్ సినిమాలనుండి కాపి కొట్టారని అంటున్నారు. అదే నిజమయినా మనం చిన్నపుడు చదువుకున్న చందమామ కథల లాంటి ఒక భారతీయ కథని మన భాషలో ఇంత ఘనంగా చూపించినందుకు రాజమౌళిని, నిర్మాతలని అభినందించాలి. ఎప్పుడూ చూసే రొటీన్ పగ సాధింపు సినిమాల కంటే ఈ సినిమా చాలా బెటర్. చివరలో చిన్న సందేహం. కాలకేయుడి భాష వేరేదైనప్పుడు అతని పేరు కూడ ఆ భాషలోనే ఉండాలి కదా!